బోస్టన్ కమిటీ నివేదికను రాత్రికి జగన్ డిక్టేట్ చేస్తే విజయసాయిరెడ్డి రాస్తాడు: సీపీఐ నారాయణ సెటైర్

  • ఒక సీల్డ్ కవర్, ఫైల్ ను బీసీజీ సమర్పించడం చూశాం
  • సంతకాలు పెట్టిన వైట్ పేపర్లు మాత్రం దాంట్లో ఉంటాయి
  • ఈ కమిటీల తంతు అంతా ఇలాంటిదే
ఏపీ అభివృద్ధి, రాజధాని విషయమై సిఫారసులు చేస్తూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదికను సీఎం జగన్ కు సమర్పించిన విషయం తెలిసిందే. ఈ విషయమై సీపీఐ నారాయణ విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక సీల్డ్ కవర్, ఒక ఫైల్ ను బీసీజీ సమర్పించడం చూశామని, ‘నాకు తెలిసినంత వరకూ వీళ్లు (బోస్టన్ కమిటీ) సంతకాలు పెట్టిన వైట్ పేపర్లు మాత్రం దాంట్లో ఉంటాయి. రాత్రికి జగన్ మోహన్ రెడ్డి డిక్టేట్ చేస్తే విజయసాయిరెడ్డి రాస్తాడు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన నారాయణ, అదే రాబోయే రిపోర్టు అని సెటైర్లు వేశారు. ఈ కమిటీల తంతు అంతా ఇలాంటిదేనని, దాని గురించి ఏం కంగారుపడక్కర్లేదని అన్నారు.

ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు, అయితే, ప్రభుత్వానికి ఒక గౌరవం ఉండాలని, వైసీపీ ప్రభుత్వానికి ఆ గౌరవం లేదని విమర్శించారు. ఏ ప్రభుత్వం అయినా ఒక శాసనం చేస్తే అది అమలవుతుందన్న నమ్మకం పోయిందని, అలా, అపహాస్యంపాలు చేసిన చరిత్ర దేశంలో ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదని విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చాలామంది హైదరాబాద్ నుంచి విజయవాడకు రావడం వారికి ఇష్టం లేదని, ఇప్పుడు, ఇక్కడి నుంచి విశాఖపట్టణం పోవాలంటే వాళ్లు సుముఖంగా లేరని నారాయణ చెప్పారు.
Go Back to Shorts
Boston Committee
CPI Narayana
Jagan
Vijayasai

More Telugu News